హైదరాబాద్ : కోవిడ్-19 వైరస్ ప్రకంపనలు దేశీయ ఫార్మ రంగాన్ని తాకనున్నాయి. చైనా నుండి ముడి పదార్థాల దిగుమతి నిలిచిపోవడంతో పరిస్థితి భయంకరంగా ఉందని (ఐపీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. భారత పార్మా పరిశ్రమలో కేవలం రెండు, మూడు నెలల వరకు మాత్రమే సరిపడా ముడిపదార్థం నిల్వలు (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్, ఏపీఐ) ఉన్నాయని తెలిపింది. మార్చి నెల నుంచి దిగుమతులు తిరిగి ప్రారంభమైతేనే పరిస్థితి చక్కబడే అవకాశాలున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
చాలా క్లిష్టమైన, తీవ్రమైన పరిస్థితిలో భారతీయ ఫార్మా పరిశ్రమం ఉందని ఐపీఏ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తెలిపారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏమి జరుగుతుందో ఎవరికీ పూర్తి అంచనాలేదనీ, పరిస్థితి ఎప్పటికి మెరుగుపడుతుందో లేదో ఊహించడం చాలా కష్టమని తెలిపారు. కేవలం రెండు, మూడు నెలలకు సరిపడా ముడి పదార్థాలు మాత్రమే మిగిలి వున్నాయని జైన్ చెప్పారు. అయితే ప్రతీ రోజూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు ఏపీఐలను యూరోపియన్ దేశాలనుంచి దిగుమతి చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు.